రచన - తాడిగడప శ్యామలరావు
ఎవ్వరి వాడనో ఎరుగను నేను నీ
వెవ్వడవో నేను నీ వాడ నంటివి
ఈ విశాలభువనమున యిన్నాళ్ళు తిరుగుచు
నా వారని గురుతు పట్ట నైతి నొక్కరిని గాని
ఈ వేళ కనుల యెదుట నేదో యొక మాయగా
నీవు కనుపించితి విది నిజమా ఒక కలయా ॥ ఎవ్వరి॥
ఇన్నిన్ని యుగాలుగా యే యొక్కరైన నను
మన్నించి ఆత్మీయత చిన్నమెత్తు పంచరు
ఇన్నాళ్ళకు నా యాత్మ నెరిగి చేరితి వీవు
వన్నెకాడ నాకు తోడువై యుందువా ఇక ॥ఎవ్వరి॥
నా లోన నుంటివా నా కెరుక లే కుండ
కాల మెంతగడిపితి నీ కలిమి యెరుక లేకుండ
మేలు మేలు నేటికైన మిగులదయ చూపితివి
నీలాంబోధరశ్యామ నిన్ను విడువ రామ ॥ఎవ్వరి॥
---------
---------
ఈ సంచికలోని ఇతర రచనలు
శ్యామల రావు గారి ఆలాపన నేనెప్పుడు వినే అవకాశం రాలేదు గాని , ఆయన కీర్తనలు పఠించే అవకాశం మాత్రం కలిగింది . జనరంజకంగా వుండటమే కాదు , మనోరంజకంగా వున్నాయి .
ReplyDeleteఈ రామ కీర్తన లో ప్రతి పంక్తి అంతర్గత తపనతో వ్రాసినట్లున్నది . ఇది బాగున్నది ఇది బాగా లేదు అనటానికి వీలు లేకుండా అమోఘంగా వున్నది .
ఎవరికి వారు వరి జీవితాలకు అన్వయించుకోవలసినదీ రామకీర్తన .